పాలకొండ డివిజన్: అభివృద్ధికి ఆమడదూరం - పీడిత ప్రజల ఆవేదన!

                                     కళాభారతి న్యూస్ & పాలకొండ వెబ్ న్యూస్ : 

పాలకొండ,  చరిత్రలో పురాతన తాలూకా కేంద్రంగా, వ్యవసాయానికి పెద్దపీట వేసిన ప్రాంతంగా పాలకొండకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సాత్విక స్వభావం కలిగిన ఈ ప్రాంత ప్రజలు        దశాబ్దాలుగాఅభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు అయితే, పాలకొండ డివిజన్ ప్రస్తుత పరిస్థితి చూస్తే, అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉందని చెప్పక తప్పదు. ముఖ్యంగా, ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజన ఈ ప్రాంత ప్రజలకు "కునుకు నక్కపై తాటిపండు పడినటుల" తీవ్ర నిరాశను, అన్యాయాన్ని మిగిల్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

Demand to form a new district in Palakonda

🛣️ డివిజన్ అభివృద్ధికి దూరంగా...

పాలకొండ డివిజన్ వ్యవస్థాపక కాలం (1962) నుండి నేటి వరకు ఎస్.సి. లేదా ఎన్.టి. అభ్యర్థులకు రిజర్వ్ చేయబడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో డిగ్రీ కాలేజీ, ఆర్.టి.సి. డిపో వంటి మౌలిక వసతులు మంజూరై కొంత ఊరట లభించినప్పటికీ, ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదనేది నగ్న సత్యం.

 * తాగునీటి సమస్య: పాలకొండ నగర పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య దీర్ఘకాలికంగా వేధిస్తోంది. నాన్-అమృత్ పథకం కింద నిధులు మంజూరైనా పనులు నత్తనడకన సాగడం, పాత పైప్‌లైన్ల వల్ల కలుషిత నీరు సరఫరా కావడం వంటి సమస్యలతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.

 * పారిశుద్ధ్యం – రోడ్లు: అనేక వీధుల్లో రాత్రి పూట దీపాలు లేక అంధకారం అలుముకుంటోంది. డ్రైనేజీ సమస్య, రోడ్ల పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉంది.

 * ఆర్టీసీ సౌకర్యాలు: పాలకొండ ఆర్టీసీ డిపో పరిధిలో తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేక ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.

💔 జిల్లాల విభజనతో మరింత అన్యాయం

సువిశాలమైన రెవెన్యూ డివిజన్‌గా ఉన్న పాలకొండను గతంలో శ్రీకాకుళం జిల్లా నుండి వేరు చేసి, తాజాగా ఏర్పడిన పార్వతీపురం మన్యం జిల్లాలో కలపడంపై ప్రజానీకం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం తమను మరింత అన్యాయానికి గురి చేసిందని డివిజన్ ప్రజలు భావిస్తున్నారు.

 * దూరాభారం: పాలకొండ డివిజన్‌లోని భామిని, సీతంపేట, పాలకొండ మండలాల ప్రజలు జిల్లా కేంద్రమైన పార్వతీపురానికి వెళ్లాలంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఇది వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని కావడంతో, సాధారణ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది.

 * పరిపాలనా ఇబ్బందులు: జిల్లా ఏర్పడి మూడేళ్లయినా, కీలక శాఖలకు పూర్తిస్థాయి అధికారులు లేకపోవడం, ఇన్‌చార్జిల పర్యవేక్షణ, ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడం వంటి పరిపాలనా లోపాల వల్ల ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు.

📢 ప్రస్తుత ప్రజల ఆందోళన

"బడుగు, బలహీన వర్గాల ప్రజలు అధికంగా ఉన్న పాలకొండ డివిజన్.. అభివృద్ధి లేక అనాదరణకు నోచుకోక, అణచివేయబడ్డామని భావిస్తున్న ఈ తరుణంలో, జిల్లా కేంద్రం మార్పు తమపై మరింత భారం వేసింది" అని స్థానిక ప్రజా సంఘాలు, పీడిత తాడిత ప్రజానీకం గళం విప్పుతున్నారు. తమ భవిష్యత్తు విషయమై తీవ్ర ఆందోళన చెందుతున్న డివిజన్ ప్రజలు, గత పాలకులు తమను అధఃపాతాళానికి నెట్టేశారని విమర్శిస్తున్నారు.

పాలకొండ ప్రజల ప్రధాన డిమాండ్లు:

 * పాలకొండను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలి.

 * ప్రత్యేక జిల్లా సాధ్యం కాకపోతే, తిరిగి శ్రీకాకుళం జిల్లాలో కొనసాగించాలి.

 * డివిజన్‌లో మౌలిక వసతులు, అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.

  ప్రభుత్వం తక్షణమే స్పందించి, అభివృద్ధికి దూరమైన పాలకొండ డివిజన్ ప్రజల ఇబ్బందులను తీర్చి, వారి న్యాయమైన కోరికలను నెరవేర్చాలని స్థానికులు కోరుకుంటున్నారు. News by : BSS Prasad. 

.. తరువాయి భాగం రేపటి మన పాలకొండ వెబ్ న్యూస్ లో చూడండి... పాలకొండ స్థానిక వార్తలకు సంబంధించి గూగుల్ సెర్చ్ బాక్స్ లో https://palakondawebnews.blogspot.com/సెర్చ్ చేయండి.

 పాలకొండ దేవాలయాలకు సంబంధించిన       విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Post a Comment

0 Comments