నకిలీ టీటీడీ లేఖల కలకలం: మంత్రి పేరు వాడుతూ మోసం దళారుల ఉచ్చులో భక్తులు.. మంత్రి పీఏ ఫిర్యాదుతో కేసు నమోదు

 


విజయవాడ/తిరుమల, నవంబర్ 17: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల పేరుతో నకిలీ టీటీడీ లేఖలు (టికెట్లు) విక్రయించే దళారుల వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. తాజాగా, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ లేఖలు చలామణి కావడం తీవ్ర కలకలం సృష్టించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని, దళారులు ఈ నకిలీ పత్రాలను విక్రయించి భారీగా నగదు దండుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు భక్తులు మంత్రి సత్యకుమార్ పేరుతో ఉన్న నకిలీ లేఖలను కొనుగోలు చేసి, దర్శనానికి వెళ్లగా, టీటీడీ అధికారులు అవి నకిలీవని తేల్చి వెనక్కి పంపారు. తాము మోసపోయామంటూ బాధితులు మంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించారు. గత కొంతకాలంగా మంత్రి పేరుతో ఈ నకిలీ లేఖలు జారీ అవుతున్నట్లు గుర్తించిన మంత్రి సత్యకుమార్ పీఏ, ఈ వ్యవహారంపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని కోరుతూ విజయవాడ నగర సీపీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే నకిలీ టికెట్ల విక్రయాలపై పోలీసులు పలువురిని అరెస్టు చేసినప్పటికీ, ఈ మోసాలు మళ్లీ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ తరహా మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు టీటీడీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. 

News by : Boddepalli Venkata Ramana. 

Post a Comment

0 Comments