పాలకొండ కోమటిపేటలో జగద్గురు సనారీ విశ్వేశ్వర అన్నపూర్ణాంబ మఠంలో..మహా శివరాత్రి మహోత్సవాలు

పాలకొండ వెబ్ న్యూస్: స్థానిక కోమటిపేటలోని జగద్గురు సింహాద్రి సనారీ విశ్వేశ్వర అన్నపూర్ణామాంబ మఠంలో మహా శివరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ ఆధ్యాత్మిక వేడుకలకు సంబంధించి మఠం కమిటీ ఆహ్వాన పత్రికను విడుదల చేసింది. ఫిబ్రవరి 15న (మహా శివరాత్రి పర్వదినం) తెల్లవారుజామున 3 గంటల నుండే స్వామివారికి పంచామృతాలతో విగ్రహారాధన, భక్తులచే విశేష అభిషేక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారికి మహానైవేద్యం సమర్పించి, అనంతరం 1 గంట నుండి ఆలయ అభివృద్ధి కమిటీ, పురజనులు మరియు భక్తుల సహకారంతో భారీ ఎత్తున మహా అన్నసమారాధన కార్యక్రమం జరుగుతుంది.

​మధ్యాహ్నం 2 గంటల నుండి అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించనున్నారు. ఈ పూజల్లో పాల్గొనదలచిన భక్తులు ముందుగా మఠం కమిటీని సంప్రదించి టిక్కెట్లు తీసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఉత్సవాల్లో భాగంగా అంతకుముందే, అనగా ఫిబ్రవరి 4వ తేదీ బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు సనారీ విశ్వేశ్వర స్వామి మాలాధారణ కార్యక్రమం వైభవంగా జరిగింది.
​శివరాత్రి పర్వదినం రోజున ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు రాజాంకు చెందిన బ్రహ్మశ్రీ బంగారు దుర్గాప్రసాదరావు ఆచారి   గీతాపారాయణం చేస్తారు. అనంతరం 10 గంటల నుండి 12 గంటల వరకు ఆయుర్వేదరత్న బ్రహ్మ డాక్టర్ అండులూరి సోమేశ్వరరావు ఆచారి జగద్గురు సనారి విశ్వేశ్వర స్వాముల జీవిత చరిత్ర, మహిమల గురించి ఉపన్యసిస్తారు. వీరు వీర బ్రహ్మం గారి జీవిత చరిత్ర, కాలజ్ఞానం మరియు సనారీ వారి జీవితచరిత్ర గ్రంథకర్తగా భక్తులకు విశేష ఆధ్యాత్మిక ప్రసంగం అందించనున్నారు.
​సాయంత్రం 6 గంటలకు స్వామి వారి తిరువీధి ఉత్సవం మంగళ వాయిద్యాలుతో అతివైభవంగా సాగుతుంది. రాత్రి 9 గంటల నుండి బి. మల్లేశ్వరరావు టీచర్ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి, ఆర్కెస్ట్రా కార్యక్రమాలు భక్తులను అలరించనున్నాయి. ఈ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకల్లో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని మఠం కమిటీ చైర్మన్ టేకి రామకృష్ణ అధ్యక్షులు టేకి ప్రసాదరావు ఉపాధ్యక్షులు రీసు రవి, సెక్రటరీ ఒమ్మి శంకర్రావు, కోశాధికారి మేటికోట ఉమామహేశ్వరరావు, సెక్రటరీ సుగంధం సంగీతరావు,  జాయింట్ సెక్రెటరీ  గోన్నాభక్తుల ప్రకాశరావు, ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ పాడి కోరారు.

Post a Comment

0 Comments