రాజాంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ ఏజెంట్ల శిక్షణ, ఓటర్ల సవరణ కార్యక్రమం

పాలకొండ వెబ్ న్యూస్, 08-06-2026:

​విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ ఆధ్వర్యంలో, రాజాం నియోజకవర్గ ఇంచార్జ్ తలే రాజేష్ అధ్యక్షతన 284 మంది బూత్ ఏజెంట్లకు శిక్షణా కార్యక్రమం, ఎస్ఐఆర్ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాజాం పరిశీలకులు సూర్యనారాయణ రాజు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ సిరిపురపు జగన్మోహన రావు, మాజీ శాసన సభ్యులు తలే భద్రయ్య హాజరయ్యారు.

​ఈ సందర్భంగా పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ బూత్ స్థాయి బలోపేతమే పార్టీ విజయానికి అసలైన బలం అనగా, తలే రాజేష్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

​కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఎస్ఐఆర్ కోఆర్డినేషన్ టీం సభ్యులు గణేష్, సతీష్, జిల్లా కోఆర్డినేటర్ మరిచర్ల గంగారావు ఓటర్ల వివరాల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపులపై పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 284 మంది బిఎల్ఏలతో పాటు నాలుగు మండలాల ఎంపీపీలు, జడ్పిటిసిలు, మండల కన్వీనర్లు, నగర పంచాయతీ కమిటి అధ్యక్షులు, అనుబంధ విభాగ అధ్యక్షులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

​పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments